Saturday, April 28, 2012

మిథునం - శ్రీ రమణ


శ్రీ రమణ గారు రాసిన ఎనిమిది కథల సంపుటి ఈ పుస్తకం. సున్నితమయిన వ్యంగ్యం, గిలిగింతలుపెట్టే హాస్యం, చక్కని శైలి తో ఇందులోని కథలన్నీ ఆకట్టుకుంటాయి.

ఇందులోని మొదటి కథ 'అరటిపువ్వు సాములారు' నాకు అంతగా నచ్చలేదు, మొత్తం కథల్లో నాకు అంతగా నచ్చని కథల్లో ఇది ఒకటి, మరోటి 'పెళ్లి' అనే కథ. ఈ కథంతా ఒక పెళ్లి లో జరిగే సంభాషణల చుట్టూ తిరుగుతుంది. బోల్డన్ని అంశాల చుట్టూ తిరిగే ఈ సంభాషణలు నవ్వు తెప్పిస్తాయి.
నచ్చని కథలను వదిలేసి నచ్చిన కథల్లోకి వచ్చేస్తా,

తేనెలో చీమ - కథానాయకుడి జీవితంలోని విషాదానికి కొంచెం వ్యంగ్యం జోడించి రాసిన కథ. పేరు అతికినట్టుగా సరిపోయింది :)


వరహాల బావి - ఒక ఊరిలో వరహాలమ్మ అనే పెద్దావిడ ఇల్లున్న చోట తవ్విన బావి ఊరందరికీ ఎలా దారి చూపిందో, అదే బావి ఊర్లో గొడవలకు ఎలా దారి తీసిందో చాలా చక్కగా వర్ణించిన కథ.

ధనలక్ష్మి - భార్య-భర్తల మధ్య వచ్చే 'ఇగో' సమస్య గురించిన కథ. ధనలక్ష్మి తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేము.

షోడా నాయుడు - షోడా గోలి కోసం షోడా అమ్మే నాయుడి చుట్టూ తిరుగుతూ కథకుడు పడే పాట్లతో నవ్వు తెప్పిస్తూనే గడచిపోయిన మన బాల్యాన్ని కళ్ళ ముందుకు తెస్తుంది ఈ కథ.

బంగారు మురుగు - ఇది నా alltime ఫేవరెట్ కథ. వేరే కథా సంపుటాల్లో ఈ కథ చదివేసాను. కానీ ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది.వెనకటి తరం లోని కుటుంబ వాతావరణం, బామ్మ-మనుమడి అనుబంధం, బామ్మ గారి లౌక్యం, గుణం అన్నీ మనల్ని కట్టిపడేస్తాయి.

మిథునం - ఇది భార్యా-భర్తల మధ్య జరిగే కథ. ప్రతి ఇంట్లోనూ ప్రతి నిత్యం సాగే సరదా గొడవలు, వాటితోనే ఇద్దరి సహజీవనం గురించి ఎంతో చక్కగా వర్ణించారు. ఇందులో తాతగారికి తిండి యావ ఎక్కువ. నాకయితే కథ చదువుతున్నంత సేపు నోట్లో నీళ్లూరుతూనే వున్నాయి ఆ పాత కాలం నాటి వంటలు, అవి వండే విధానం చదువుతూ వుంటే.

పుస్తకం మొత్తం చదివేసాక కమ్మటి తెలుగింటి భోజనం చేసినట్టనిపించింది నాకు :)


2 comments:

  1. I appreciate your vocabulary. You express very aptly. Your posts are a treat to Telugu lovers. :-)

    Will check this book sometime.

    ReplyDelete